చిన్న సినిమాల కోసం పెద్ద నిర్మాత కొత్త మార్గం!
Mythri Ravi Shankar Suggests New Film Industry Plan
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో `ప్రోగ్రెస్సివ్ ప్యానెల్` తరఫున పోటీ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ పరిశ్రమ సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త దిశానిర్దేశం చేశారు. టాలీవుడ్లో వారానికి మూడు, నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా విజయాల శాతం కేవలం పది నుంచి ఇరవై శాతానికే పరిమితమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాలు, ఓట్ల వేటకే ప్రాధాన్యమివ్వకుండా.. చిన్న నిర్మాతలు నిర్మించే చిత్రాలు థియేటర్లలో నిలదొక్కుకునేలా చేయడమే అసలైన లక్ష్యమని పేర్కొన్నారు. నైజాంలో తాము పంపిణీ చేసిన 180 చిత్రాలలో 150కి పైగా చిన్న సినిమాలే ఉన్నాయని గుర్తు చేస్తూ.. చిన్న చిత్రాల విడుదలకు తమ మైత్రి బ్యానర్ ఎప్పుడూ భరోసాగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
సినిమాను నిర్మించి కేవలం పూర్తి చేయడం మాత్రమే కాకుండా.. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడే పరిశ్రమ కళకళలాడుతుందని రవిశంకర్ విశ్లేషించారు. ఇందుకోసం సీనియర్ నిర్మాతలు, అగ్ర నిర్మాణ సంస్థల అధినేతలతో కూడిన ఒక ప్రత్యేక సపోర్ట్ సిస్టమ్ లేదా కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పోటీలో లేని సితార వంశీ, యూవీ వంశీ, బాపి, స్వప్న, సుప్రియ వంటి ప్రముఖ నిర్మాతలతో కలిసి స్క్రిప్ట్ దశలోనే కథా పటిష్టతపై, సాంకేతిక అంశాలపై తగిన సలహాలు అందించడం వల్ల చిన్న సినిమాల సక్సెస్ రేటు గొప్పగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కథల ఎంపిక నుంచి క్వాలిటీ కంటెంట్ రూపుదిద్దుకోవడం వరకు ఈ రివైజింగ్ & రివ్యూయింగ్ ప్రాసెస్ విధానం సహాయపడితే టాలీవుడ్లో ప్రతి ఒక్క నిర్మాతకు మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







































