భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని
PM Modi inaugurates Bhogapuram airport
ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో నవశకం మొదలు కాబోతోంది.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆగష్టు 1 న లాంఛనంగా ప్రారంభించారు. ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో విమానయాన వసతులు, పర్యాటకం, వాణిజ్యం సహా ఆయా రంగాల్లో అభివృద్ధికి బీజం పడింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, అశోక్గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
దాదాపుగా 50 ఏళ్లకు అవసరమైన మౌలిక వసతుల్ని ఈ విమానాశ్రయంలో కల్పించారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో దేశ, విదేశాలతో అనుసంధానం మెరుగుపడుతుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనంలో కలియదిరిగి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రత్యేకతలు, నిర్మాణ విశేషాలను జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి.మల్లిఖార్జునరావు, బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ప్రధానికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర కళావైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహూకరించి సత్కరించారు.








































