హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రఖ్యాత సాంస్కృతిక కళా వేదిక త్యాగరాయ గానసభలో ఇటీవల మంగళమయ ముహూర్తంలో శృంగేరీ పండితుల వైదిక మంత్రాల మధ్య ప్రతిష్టించిన శ్రీ అభయ గణపతి దేవాలయం (Sri Abhaya Ganapathi Devalayam)లోని కృష్ణ శిల అభయ గణపతికి గత వారం రోజులుగా కళాకారుల అభివాదాలు జోరు పెరిగింది.
ఈనాటికీ కళా, సాహిత్య ఆధ్యాత్మిక రంగాలకు చెందిన కార్యక్రమాలు సుమారు రోజూ మూడు జరిగే త్యాగరాయ గానసభకు సుదీర్ఘమైన అద్భుత సాంస్కృతిక చరిత్ర ఉందనేది నిర్వివాదాంశం.
గత దశాబ్దకాలంగా గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి త్యాగరాయగానసభ (Tyagaraya Gana Sabha)ను అనేక రకాలుగా.. వేల కళాకారులకు ఉపయోగపడేలా వివిధ కోణాల్లో అభివృద్ధి చేస్తున్న అంశాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్లతో పాటు ఎందరో సాహిత్య సినీ సంగీత నాట్య దిగ్గజాలు విశ్వనాధ సత్యనారాయణ, మధునాపంతుల, జగ్గయ్య, సి. నారాయణ రెడ్డి, కే.వి రమణాచారి, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, కైకాల సత్యనారాయణ, సుబ్బరామిరెడ్డి, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, పీ. సుశీల, ఎస్. జానకి, సిరివెన్నెల సీతారామశాస్ట్రీ, ఎం. ఎం. కీరవాణి, సుద్దాల అశోక తేజ, చంద్ర బోస్, వాడ్రేవు చిన వీరభద్రుడు, తనికెళ్ళ భరణి, శోభానాయుడు, మంజు భార్గవి వంటి ప్రముఖులెందరివో ప్రసంగాలు, గ్రంథావిష్కరణలు, పాటల కచేరీలు, నాట్య వైభవాలతో ఈ కళా స్థలం పులకరించి పోయిందని కళా జనార్ధనమూర్తి (Kala Janardana Murty) చెప్పారు.
ఇటీవల త్యాగరాయగానసభ కమిటీ ఆధ్వర్యంలో.. ఈ ప్రాంగణంలో అతి అరుదైన కృష్ణ శిలతో నిర్మించిన ఈ అభయగణపతి ఆలయంలో ప్రసన్నంగా ఆశీనులైన అభయగణపతి మంగళ విగ్రహానికి పవిత్ర పుష్పార్చనతో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ప్రతిష్టా ప్రారంభోత్సవ శ్రీకార్యాన్ని ప్రారంభించిన శిలా ఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.
గత వారం రోజులుగా వస్తున్న ప్రతీ కళాకారుడు ముందు ఈ ఆలయం ముందు చెప్పులు విప్పి నమస్కరించుకుని ఆడిటోరియంలోకి వెళ్లడం మనకు కనిపిస్తోంది.
కళా జనార్ధన మూర్తి విగ్రహ ప్రతిష్ట సమయంలో పవిత్రమయ హోమాలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతంలో మరొక శోభాయమాన విగ్రహాలను ప్రతిష్టించే అవకాశం కనిపిస్తోంది.
అయితే.. అసూయ, ద్వేషాలపై ఎప్పుడూ ఘాటైన విమర్శలు చేసే ప్రముఖ రచయిత, అమోఘమైన వక్త, పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) స్వచ్ఛమైన హృదయం వున్న ప్రతిభాశాలిగా జంటనగరాల కళా సాహిత్య వాతావరణంలో ఉన్న సంస్కారప్రదమైన అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పురాణపండ శ్రీనివాస్చే ఈ మనోహరమైన విగ్రహాన్ని ప్రతిష్టింప చేసినట్లు సమాచారం. గత దశాబ్దకాలంగా శ్రీనివాస్ రచనా సంకలనాలు సుమారు పది ఆర్ష ధార్మిక గ్రంధాలను వేలమంది రసజ్ఞులకు ఉచితంగా అందించామని, అనూహ్యమైన స్పందన వచ్చినట్లు గానసభ కమిటీ పేర్కొంటోంది. ఏది ఏమైనా చారిత్రాత్మక రాజమహేంద్రవరానికి చెందిన ఆధ్యాత్మిక పుంజీభూత చైతన్యమైన పురాణపండ శ్రీనివాస్కి ఆరుదశాబ్దాలుగా ఎవరికీ దక్కని పవిత్ర ఘనత దక్కడం శ్రీనివాస్ నిర్విరామ అసాధారణ అద్భుత కృషిగా చెప్పకతప్పదు.