ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన సంగీతాన్ని ప్రేమించే వారందరికీ ఓ అద్భుతమైన మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నా టూర్ ఎం.ఎం.కె పేరుతో లైవ్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ సంగీత సంబరం మార్చి 22న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని హైటెక్స్లో గ్రాండ్గా ప్రారంభం కానుంది.
ఈ ఈవెంట్కు సంబంధించిన వివరాలను కీరవాణి సోదరుడు, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమంపై ఆసక్తిగా ఉన్నానని, ప్రత్యేకంగా ఓ కోరిక కూడా ఉందని తెలిపారు.
రాజమౌళి మాట్లాడుతూ.. మార్చి 22 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ లైవ్ కన్సర్ట్లో అన్నయ్య స్వరపరచిన పాటలు, ఇతర చిత్రాల హిట్ సాంగ్స్ ఉంటాయి. అయితే నా ప్రత్యేక కోరిక ఏమిటంటే, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కూడా ప్రదర్శించాలని అన్నారు.
అన్నయ్య అందించిన రీ-రికార్డింగ్ అసాధారణమైనది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైవ్ ప్రదర్శన అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ కన్సర్ట్లో ఓఎస్టీ భాగం కావాలని నా కోరిక. మీరూ నా అభిప్రాయానికి మద్దతుగా ఉండండని రాజమౌళి అభిమానులను కోరారు.
ఈ లైవ్ కన్సర్ట్పై సినీ సంగీత ప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కీరవాణి స్వరపరిచిన ఎన్నో హిట్ పాటలు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, ప్రత్యేకమైన మ్యూజికల్ సెషన్లు ఈ ఈవెంట్ను మరింత రసవత్తరంగా మార్చబోతున్నాయనే ఆశలో ఉన్నారు.