భోళాశంకర్ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ముఖ్యంగా యువ దర్శకుల కథలను ఎక్కువగా వింటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టారు. దసరా సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరు ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ను హీరో నాని సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది. చిరు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని నాని స్వయంగా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన ఓ ఇంటెన్స్ పోస్టర్ను కూడా షేర్ చేశారు. చేతుల నుంచి రక్తం కారుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు విశేష ప్రాధాన్యత ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్రకు రాణీ ముఖర్జీ అయితేనే పూర్తి న్యాయం చేయగలరని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భావించారని సమాచారం. ఈ విషయాన్ని చిరంజీవికి వివరించగా చిరు కూడా రాణీ ముఖర్జీ అయితేనే సరైన ఎంపిక అవుతారని ఆమె తన పాత్రను గొప్పగా పోషించగలరని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్పై భారీ అంచనాలు ఉండగా రాణీ ముఖర్జీ ఎంట్రీతో సినిమా ఇంకాస్త ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్పైకి వెళుతుందో చూడాలి.