Advertisement

షర్మిల అక్షరూపంలో అన్న బాగోతం!

Fri 25th Oct 2024 05:13 PM
ys jagan  షర్మిల అక్షరూపంలో అన్న బాగోతం!
Jagan Bagotham in Sharmila character! షర్మిల అక్షరూపంలో అన్న బాగోతం!
Advertisement

వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తుల వివాదాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య గొడవలు ముదురుతున్నాయే తప్ప పరిష్కారం కావట్లేదు. పోనీ ఇటు అటు ఎవరో ఒకరు కాస్త అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తారో అబ్బే అస్సలు కావట్లేదు. అటు జగన్ లేఖాస్త్రాలు, కోర్టులు ఆశ్రయించడం చేస్తుంటే.. ఇటు షర్మిల కూడా తగ్గేదేలే అన్నట్లుగా మీడియా ముందుకు రావడం చేస్తూ వస్తున్నారు. తాజాగా వైఎస్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఇందులో జగన్ బాగోతం అంతా పూసగుచ్చినట్లుగా వివరించారు. దీంతో పాటు వైఎస్ బతికున్నప్పుడు ఏం జరిగింది..? ఆ తర్వాత జగన్ ఏం చేశారు..? ఎందుకు విడిపోవాలని అనుకున్నారు..? షర్మిల ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందనే విషయాలన్నీ ప్రస్తావించారు. షర్మిల రాసిన లేఖ యథావిధిగా..

నాన్నకు నేనంటో ఎంతో ప్రేమ..

అమ్మ వైఎస్ విజయమ్మ గారు, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కు సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు గార్డియన్ మాత్రమే. అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి,స్పష్టంగా తెలిసిన విషయం. నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి, భారతి సిమెంట్స్ సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా... నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు.. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే .. ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే.

నాకు రావాల్సిందే..

నేను జగన్ మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాట అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి గారు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే..ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం గనుక,ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత..10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని..నా శక్తికి మించిన సహాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో, ఏమో.. నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినట్లుగానే.. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే. ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీల్లోనీ డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్ళు చేసింది ఉపకారం కాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో సగం వాటా ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుగా చూపించమన్నారు.

ఇదీ ఆస్తుల లెక్క..

2019లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సిఎం అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాకుండా సిఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఇందుకు అమ్మా, నేను వద్దు అని చెప్పాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాడు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే .. 5 శాతం ఎక్కువ తీసుకో.. లేదా 10 శాతం ఎక్కువ తీసుకో.. కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పింది. అయినా ఇంతే అని బుల్డోజ్ చేశారు. తర్వాత అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది. ఆ కొద్దీ వారాల్లోనే MOU తయారయ్యింది. అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి.. అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టాం. నా వాటా నాకు ఇస్తున్నాడు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదనేది వాస్తవమైనా, జగన్ మోహన్ రెడ్డి గారిది పైచేయిగా ఉన్నది కాబట్టి.. వాళ్ళు రాసినదానిపై అమ్మ నన్ను సంతకం పెట్టమని కోరింది. కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, MOU మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదు. అమ్మ గట్టి ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ ఇండివిడ్యువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.

ప్రమాణానికి నేను రెడీ

అదే 2021లో, నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగింది. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నన్ను తొక్కడానికి జగన్ మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నం లేదు. నా మీద, అమ్మ మీద NCLT లో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ED అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దు కి ఎటువంటి సంబంధం లేదు. నేను జగన్ గారికి ఒక లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్ లో పోస్ట్ అయితే… నాకు ఏం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను గాని, నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం YSR బిడ్డకు లేదు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అమ్మ, నేను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, YSR అభిమానులు భావించకూడదని.. పైనున్న వాస్తవాలు అన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుచేస్తున్నా.. MOU నా చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా...దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా... ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, ఈ MOU నాకు నేనుగా బయటపెట్టలేదు. అవకాశం, అవసరం ఉన్నా...ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా.. కుటుంబ గౌరవం, YSR పరువు కోసం నేను ఎక్కడా 5 ఏళ్ళు MOU బయట పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన MOU ఈరోజు బయటకు వచ్చిందన్నా.. పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా.. NCLT లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బ్రతుకు మీద అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో YSR బంధం ఏర్పరుచుకున్న ప్రతి YSR బంధువుకి ఈ వివరణ ఇస్తున్నాను’ అని షర్మిల రాసుకొచ్చారు. దీనిపై ఇప్పటి వరకూ వైసీపీ నేతలు స్పందించలేదు.. ఒకవేళ స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Jagan Bagotham in Sharmila character!:

YS Sharmila Shocking Comments on YS Jagan

Tags:   YS JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement