Advertisement

రాసుకోండి.. నా మతం మానవత్వం!

Fri 27th Sep 2024 05:28 PM
ys jagan  రాసుకోండి.. నా మతం మానవత్వం!
YS Jagan Sensational Press Meet రాసుకోండి.. నా మతం మానవత్వం!
Advertisement

తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో వెంకన్న దర్శనానికి వెళ్లాలని భావించి.. అనివార్య కారణాల వల్ల వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్.. లడ్డూ వివాదంతో పాటు తాజా పరిణామాలు, పర్యటన రద్దు వ్యవహారంపై కూడా క్లారిటీ ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తిరుపతి ప్రతిష్టను రాజకీయ దురుబుద్ధితో దగ్గర ఉండి అపవిత్రం చేస్తుంటే ఇంతకన్నా దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా..? అని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా 3648 కి.మీ పాదయాత్ర అయిపోయాక కాలినడకన కొండా ఎక్కి.. స్వామి వారినీ దర్శించుకొని ఇంటికి వెళ్ళాను అనే విషయాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. 

నా మతం మానవత్వం!

నేను 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆ స్వామి వారికీ  భక్తి శ్రద్ధలతో నేను పట్టు వస్త్రాలు సమర్పించాను. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నా... బయటికి పోతే హిందూ, ఇస్లాం, సిక్కిజం అనుసరిస్తాను గౌరవిస్తాను. నేను ఇండియన్.. నా మతం మానవత్వం డిక్లరేషనులో రాసుకుంటే రాసుకోండి. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు. నోటీసులు ఇచ్చి.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. దేశంలో ఎక్కడా చూడని పరిస్థితులు ఏపీలో చూస్తున్నాం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్‌ చేస్తామని నోటీసులు ఇస్తున్నారు ఇది ఎంత వరకూ సమంజసం అని జగన్ ప్రశ్నించారు.

దురుద్దేశంతోనే..!

ఓ వైపు నన్ను, మరోవైపు వైసీపీ శ్రేణులను తిరుమలకు వెళ్లనివ్వడం లేదు. చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమల తెప్పిస్తున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రోటీన్‌గా జరిగే కార్యక్రమం. 100 రోజుల పాలనను డైవర్ట్‌ చేయడానికే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని కన్నెర్రజేశారు.

మళ్ళీ చెబుతున్నా..!

ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని తిరుమలలో మూడుసార్లు శాంపిళ్లను పరీక్షిస్తారు. క్వాలిటీలో ఏదైనా తేడా వస్తే ట్యాంకర్లను రిజెక్ట్‌ చేస్తారు. గత చంద్రబాబు హయాంలో ఇలా 15 సార్లు రిజెక్ట్‌చే చేసి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. మా ప్రభుత్వ హయాంలో 18 సార్లు నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జూన్‌ 12 నుంచి నెయ్యి సరఫరా మొదలైంది. జులై 6 తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్లు టెస్టు్ల్లో ఫెయిల్‌ అయ్యాయి. ఆ తర్వాత ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించారు. రిజెక్ట్‌ అయిన నెయ్యి ట్యాంకర్లను మైసూర్‌లోని CFTRIకి పంపిస్తారు. కానీ మొదటిసారి నెయ్యి ట్యాంకర్లను గుజరాత్‌లోని NDDBకి పంపించారని జగన్ చెప్పుకొచ్చారు.

ఇదెలా సాధ్యం..?

జులై 23న రిజెక్ట్‌ అయిన ట్యాంకర్లలోని నెయ్యి వాడలేదని ఈవో క్లియర్‌కట్‌గా చెప్పారు. సెప్టెంబర్‌ 18న చంద్రబాబు నెయ్యిలో యూనిమల్‌ ఫ్యాట్‌ను కలపారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 19న టీడీపీ ఆఫీస్‌ నుంచి NDDB రిపోర్ట్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 20న ఈవో మీడియాతో మాట్లాడుతూ రిజెక్ట్‌ అయిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని ధృవీకరించారు. ఈవో క్లియర్‌గా రిపోర్ట్‌ ఇచ్చాక కూడా చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ ట్యాంకర్ల నెయ్యి వాడేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఆరోపణలు. స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అబద్ధాలతో తగ్గిస్తున్నారు. ఇదంతా అపవిత్రత కాదా..? అని ప్రభుత్వాన్ని, విమర్శకులను వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఐతే ఎక్కడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మాత్రం జగన్ ప్రస్తావించడానికి సాహసించలేదు.

YS Jagan Sensational Press Meet :

YS Jagan Sensational Press Meet On Tirumala Tour Cancelled

Tags:   YS JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement