ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడానికి అసలు విషయం చెప్పిన పవన్.. వరద బాధితుల కోసం ఆరు కోట్లు సీఎం సహాయ నిధికి విరాళమివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా పవన్ అంత జ్వరంతోనే పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా జనసేన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ పెట్టారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు.
అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి అన్నారు. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రివర్యులు వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు.. అంటూ ట్వీట్ చెయ్యడంతో పవన్ ఫీవర్ తోనే పని చేస్తున్నట్లుగా జనసేన కార్యకర్తలు ఆయన్ని పొగిడేస్తున్నారు.