Advertisement
TDP Ads

నారా చంద్రబాబే ఒక సైన్యం..!

Mon 01st Jul 2024 10:27 AM
chandrabab  నారా చంద్రబాబే ఒక సైన్యం..!
Nara Chandrababu is an army..! నారా చంద్రబాబే ఒక సైన్యం..!
Advertisement

అవును.. అతడే ఒక సైన్యం! అంతకుమించి వలంటీర్ (సమాజసేవకుడు).. ఇంకా చెప్పాలంటే సర్వం సీబీఎన్ అంతే! గత వైసీపీ హయాంలో లక్షలాది మంది వలంటీర్లను పెట్టి పెన్షన్లు పంచిపెట్టిన పరిస్థితిని మనందరం చూశాం..! కానీ కూటమి సర్కార్‌లో అన్నీ తానై.. సీఎం నారా చంద్రబాబు నాయుడు చూసుకుంటున్న పరిస్థితి. అదేనబ్బా.. వలంటీర్‌గా మారి పెన్షన్లు పంచిపెట్టారు. దేశ చరిత్రలో తొలిసారి స్వయంగా ముఖ్యమంత్రే లబ్దిదారుల ఇంటికి వెళ్లి పించన్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా తెల్లారుజామున 5.30 నుంచే పెన్షన్ల పండుగను బాబు షురూ చేశారు. స్వయంగా మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామానికి వెళ్లి లబ్దిదారులకు అందించారు. సుగాలికాలనీకి చెందిన బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబం చంద్రబాబు నుంచి తొలి పింఛన్‌ అందుకుంది. ఇంటి పెద్ద పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్‌, కుమార్తె ఇస్లావత్‌ శివకుమారికి వితంతు పింఛన్‌ను అందజేశారు. స్వయంగా సీబీఎన్ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తొలి పెన్షన్ పంపిణీ తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా షురూ అయ్యింది. మొత్తం 1,20,097 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రం మొత్తం తొలిరోజే పెన్షన్లు పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ప్రజావేదిక కూడా..!

నాడు వైఎస్ జగన్ సీఎం అవ్వగానే ఏదైతే ప్రజావేదికను కూల్చేసి ప్రభుత్వాన్ని నడపడం షురూ చేశారో.. అదే పేరుతో పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా గత జగన్ పాలనపై చంద్రనిప్పులు చెరిగారు. గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి ఒక పీడకల అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలను అణగదొక్కారని.. ఏ రోజు ఎలా గడుస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. గడిచిన ఎన్నికలు చరిత్రాత్మకమైనవని.. ఇలాంటి ఎన్నికల ఫలితాలను ఎప్పుడూ చూడలేదన్నారు. కూటమి గెలిచిన తర్వాత నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారన్నారు. అందుకే.. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరగాలన్నదే లక్ష్యమని బాబు తెలిపారు. ఇక సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక చరిత్ర అని.. రాష్ట్రంలో 65.31 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33,100 కోట్లు అవుతుందని.. ప్రభుత్వంపై ఎంత భారం పడినా సరే ఇచ్చి తీరుతామన్నట్లుగా చెప్పుకొచ్చారు.

మొత్తం మార్చేస్తాం..!

ఇక ఇదే ప్రజా వేదిక నుంచి చంద్రబాబు పలు తీయటి శుభవార్తలు సైతం చెప్పారు. పేదలపైనే శ్రద్ధ పెట్టి.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామన్నారు. అంతేకాదు.. ఏపీలో ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై తీపి కబురు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలకు త్వరలోనే కళ్లెం వేస్తామన్నారు. ఫింఛన్ల పంపిణీ మొదటి అడుగు మాత్రమేనన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరికం లేని సమాజ స్థాపనే ఏకైక లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే సభావేదికగా జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను చాలా మంది ముఖ్య మంత్రులను చూసా కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడని గత పాలకుడు నిరూపిస్తే.. ప్రజల అభీష్టం మేరకు, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు తాను నిరూపించాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు నవ్వుతూ చెప్పారు.

Nara Chandrababu is an army..!:

A rocky road ahead in Andhra Pradesh for Chandrabab

Tags:   CHANDRABAB
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement