Advertisement
TDP Ads

రామోజీ సభకు చిరంజీవి రాలేదేం!

Sun 30th Jun 2024 09:55 AM
ramoji rao  రామోజీ సభకు చిరంజీవి రాలేదేం!
Chiranjeevi did not come to Ramoji Sabha! రామోజీ సభకు చిరంజీవి రాలేదేం!
Advertisement

అక్షర శిల్పి, అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ విజయవాడలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు విచ్చేయగా.. టాలీవుడ్ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత అశ్వనీదత్, మురళీ మోహన్, సురేష్ బాబు, జయసుధ వీరంతా విచ్చేసి రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. మీడియా, సినీ రంగానికి రామోజీ చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడి వరకూ అంతా బాగుంది కానీ.. పెద్దాయన సభకు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలేదు..? ఆయనకు పిలుపు వెళ్లలేదా..? పిలిచినా రాలేదా..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీంతోపాటు ప్రముఖ నిర్మాత అల్లు అర్వింద్ కూడా రాకపోవడంతో చిత్ర విచిత్రాలుగా జనాలు, అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అవునా.. నిజమా..!?

చిరు, అరవింద్ ఎందుకు రాలేకపోయారో తెలియట్లేదు కానీ.. సోషల్ మీడియా వేదికగా మాత్రం ఓ రేంజిలో మాట్లాడేసుకుంటున్నారు. ఆఖరికి ప్రజారాజ్యం పార్టీకి.. రామోజీ రాసిన రాతలకు లింకులు పెట్టి మరీ విమర్శిస్తున్న పరిస్థితి. వాస్తవానికి సినీ ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి కార్యక్రమం అయినా సరే చిరు ముందుంటారు.. ఆయన బిజిగా ఉంటే తప్ప లేకుంటే దాదాపు ఏ కార్యక్రమంకు రాకుండా ఉండరు. అలాంటిది.. రామోజీ స్మరణ సభకు చిరు ఎందుకు రాలేకపోయారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇక్కడి వరకూ ఓకే కానీ.. మామ, అల్లుడు ఇద్దరూ రాకపోయే సరికి ఓ పెద్ద చర్చ అయితే నడుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు, టీడీపీ ఓటమికి కారణమైనప్పుడు.. చిరు పార్టీపై ఓ రేంజిలో ఈనాడు వార్తలు రాసిందనేది నాడు ప్రధాన ఆరోపణ. ఇలా ఒకటా రెండా వరుస కథనాలు ప్రజారాజ్యంను బెంబేలెత్తించాయి. ఆఖరికి జెండా పీకేద్దాం అనే బ్యానర్ ఐటమ్ కూడా ఈనాడులో వచ్చింది. దీంతో మీడియా మీట్ పెట్టి మరీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను నేరుగా టార్గెట్ చేస్తూ.. మా జెండా ఎవరూ పీకలేరని కూడా ఒకింత కౌంటర్‌గానే మాట్లాడారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌ను కూడా టీడీపీ నుంచి దూరం చేయడంలో రామోజీది కీలక పాత్ర అని కూడా చిరు ఆరోపించారు. నాటి మొదలైన పగ ఇప్పటికీ ఆయన మనసులో మెదులుతోందని అందుకే.. మెగాస్టార్ రాలేదని కొందరు చెబుతున్నారు.

ఇదే కారణమా..?

విశ్వంభర సినిమా షూటింగ్‌లో మెగాస్టార్ చాలా బిజీగా ఉన్నారు. అందుకే రాలేకపోయారన్నది చిరు అభిమానులు, అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. ఇక వ్యక్తిగత కారణాల రీత్యా అల్లు అరవింద్ కూడా రాలేకపోయారని మరికొందరు చెబుతున్న మాట. అయితే.. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని మామ, అల్లుడు రాలేదని నెటిజన్లు చెబుతుండగా.. అభిమానులు ఇందుకు కౌంటర్ ఇస్తున్నారు. అంత పగ, కోపం ఉన్నట్లు అయితే రామోజీరావు చనిపోయినప్పుడు ఫిల్మ్ సిటీకి ఎందుకు వెళ్లారు..? అక్కడికెళ్లి కూడా మీడియాతో ఎందుకు మాట్లాడారు..? ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ కూడా సభకు వెళ్లకూడదు కదా..? సభకు వెళ్లడమే కాకుండా గతంలో మా గురించి కూడా వార్తలు రాశారని.. అందర్నీ విమర్శిస్తారని.. ప్రజల పక్షాన నిలబడే మనిషి, ప్రశ్నించే మనిషి రామోజీ అని డిప్యూటీ సీఎం ఎందుకు చెబుతారు..? అని విమర్శకులకు మెగాభిమానులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అందుకే ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు ఇష్టానుసారం వార్తలు రాసేటప్పుడు, కారు కూతలు కూసేటప్పుడు అసలు విషయం ఏమిటో తెలుసుకుని రాస్తే మంచిది సుమీ..! చూశారుగా.. చిన్న పాటి విషయాన్ని ఎంత రచ్చ చేశారో ఆఖరికి ఏమైందో..!

Chiranjeevi did not come to Ramoji Sabha!:

Ramoji Rao Memorial Sabha In Vijayawada 

Tags:   RAMOJI RAO
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement