ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలకు డూ ఆర్ డైగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. జగన్ను ముఖ్యమంత్రిని కానివ్వం.. కుంభ స్థలాన్నే బద్ధలు కొడతామని కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు నమ్మకం-నమ్మకద్రోహం మధ్య జరుగుతున్న యుద్ధమని వైసీపీ చెప్పుకుంటూ ఉంటే.. అభివృద్ధి-ఆంధ్రా భవిష్యత్తు అంటే చంద్రబాబు అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇవన్నీ అటుంచితే.. మేనిఫెస్టోపై ఆంధ్రాలో పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవే గెలుపోటములను నిర్ణయించబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు, ఏపీలోని మేథావులు చెబుతున్న మాట.
ఏం జరుగుతుందో..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే మహిళలకు బస్సు ప్రయాణం, మూడు సిలిండర్లు ఫ్రీ అని ప్రకటించారో లేదో.. హస్తం గుర్తుపై ఒక్కటే గుద్దుడు సీన్ కట్ చేసే ఊహించని రీతిలో ఫలితం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండింటి ముందు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తెలంగాణలోనూ అదే ఫ్లో కంటిన్యూ చేసిన కాంగ్రెస్.. ఇక్కడ కూడా ఆ రెండు పథకాలను ప్రకటించింది. దీంతో ఉద్యమ పార్టీ, పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. కేసీఆర్ రాజకీయ చాణక్యత అస్సలు పనిచేయలేదు. బంపర్ మెజార్టీతో గెలిచి రేవంత్ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు కూడా ఇవే ప్రకటించారు. దీంతో ఏపీలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కూడా దీనిపైనే ఆశలు గట్టిగానే పెట్టుకున్నారు.
అక్కడ సరే.. ఇక్కడ ఎలాగో!
సూపర్ సిక్స్ పేరుతో ఇప్పటికే ఈ రెండు పథకాలను ఓ రేంజ్లో తీసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు పూర్తి మేనిఫెస్టో ప్రకటించగా మరింత తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తోంది. అయితే.. వైసీపీ మాత్రం ఈ రెండు పథకాలపై ఎంత నెగిటివ్ చేయాలో అంతా చేసేసింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల కోసం మహిళలు శివంగులై కొట్టుకుంటున్న పరిస్థితులను వీడియోలను సైతం మహిళలకు చూపించి టీడీపీకి మైనస్ అయ్యేలా చేస్తున్నది. ఒకవేళ ఈ రెండు పథకాలను మహిళలు నమ్మితే మాత్రం కూటమి కుంభ స్థలాన్ని కొట్టినట్టేనని క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ. 3 లక్షల నుంచి 10 లక్షల వరకూ పెంపు కూడా మంచి పరిణామమే. ఇక జగన్ మాత్రం నవరత్నాలు మీదే ఆధారపడ్డారు. ఇందులోనూ మహిళలకు చేయూత, పిల్లలకు అమ్మ ఒడి లాంటివి ఇలా చాలానే ఉన్నాయి. దీంతో ఎవరికి ఏ రెండు ప్లస్ అవుతాయో.. ఇంకెవరికి మైనస్ అవుతాయో జూన్-04న తేలిపోనుంది మరి.