2019 ఎన్నికల్లో వైసీపీ తరపున 175కి 151 మంది ఎమ్మెల్యేల విజయమంటే అది సాదా సీదా విజయం కాదు.. జనం అంతలా ఎందుకు నమ్మారో ఏమో కానీ బీభత్సంగా నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. అలాంటప్పుడు నెక్ట్స్ ఎన్నికల్లో ఎవరికైనా ఏమనిపిస్తుంది. వ్యతిరేకత వచ్చినా కూడా అంతో ఇంతో వస్తుంది. 151 కాకున్నా ఈసారి 100 సీట్లు పక్కా. విజయం ఖచ్చితంగా వైసీపీదే అని అనిపించడం ఖాయం. అలాంటి వైసీపీ పరిస్థితి ఇప్పుడు గాల్లో దీపంలా మారింది. ఎప్పుడు పుటుక్కున ఆరిపోతుందో కూడా చెప్పలేం. చుట్టూ సమస్యలే. బయటపడే మార్గం కూడా కష్టమే. బయట సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇక ఇంటి సమస్యలు మరింత జఠిలమయ్యాయి.
ఫోన్కు కూడా దొరకడం లేదట..
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి రావడం ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. టికెట్ల కేటాయింపు అంశం పార్టీలో కల్లోలం రేపుతోంది. ఇప్పటికే గుడ్ బై చెప్పిన నేతలు కొందరైతే.. పత్తా లేకుండా పోయిన నేతలు కొందరు.. స్థాన మార్పిడా? ససేమిరా అంటున్న నేతలు ఇంకొందరు.. మొత్తానికి కొందరైతే ఫోన్కు కూడా దొరకడం లేదట. ఒకవేళ దొరికినా ఛీకొట్టి పెట్టేస్తున్నారట. వీళ్లను బుజ్జగించేందుకు చేస్తున్న యత్నంతో తలప్రాణం తోకకు వస్తోందట కానీ ఫలితం మాత్రం దొరకడం లేదట. ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అయితే మరొక వర్గం కస్సుమంటోంది. పోనీ లోక్సభకు పోటీ చేయమంటే ఛీ కొడుతున్నారట. సర్వేల పేరు చెప్పి తప్పిద్దామంటే సోదికి కూడా దొరక్కుండా పోతున్నారట. ఎవరు రాయబారం నడిపినా పరిస్థితి దారుణమే.
అంపశయ్యపై పార్టీ..
పైగా ఫలానా వ్యక్తికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ స్థానిక నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఇక కొందరు నేతలు తాడేపల్లి ప్యాలెస్కు క్యూ కడుతున్నారట. గతంలో ప్యాలెస్ వైపు చూసేందుకు కూడా సాహసించని నేతలకు నేరుగా కార్లను లోపలికి అలో చేస్తున్నారట. ఇప్పటికే పెద్దల పిలుపుతో సోమవారం ఒక్కరోజే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సహా ఎమ్మెల్యేలు.. అనంత వెంకట్రామిరెడ్డి, ఎలీజా, శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లారు. అలాగే.. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.. ఎంపీలు నందిగం సురేశ్, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు సైతం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిన వారిలో ఉన్నారు. మొత్తానికి సీఎం జగన్ చేజేతులా పార్టీని అంపశయ్యపైకి తీసుకొస్తున్నారు.