ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు BRS నాయకులు చేస్తున్న కామెంట్స్పై విజయశాంతి ఫైర్ అయ్యారు. ఇది పద్దతి కాదు అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె రియాక్ట్ అయ్యారు. BRS నాయకులు చేస్తున్న కామెంట్స్ని ఖండించాల్సిన అవసరం కేసీఆర్కి కూడా ఉందంటూ ఆమె సూచనలు చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అయినా పది కాలాల పాటు చల్లగా ఉండాలని అనుకునే వారే అయితే.. వెంటనే బీఆర్ఎస్ నాయకుడు చేస్తున్న కామెంట్స్ని ఖండించాలని ఆమె కోరారు. రాములమ్మ ఏం చెప్పిందంటే..
బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి సర్జరీ జరిగి హాస్పిటల్లో ఉంటే, మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే.. అందుకు కూడా కొంతమంది బీఆరెస్ ముఖ్యులు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చెయ్యడం అసమంజసం. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆరెస్కు అవసరమేమో కానీ, కాంగ్రెస్కు ప్రభుత్వానికి కాదు. అట్లాంటి ప్రకటనలు చేస్తున్న బీఆరెస్ నేతలను తప్పుబట్టి ఖండించవలసిన అవసరం తప్పక కేసీఆర్ గారికి ఉంది.
అంతేకాదు, మీ కొందరు బీఆరెస్ నేతలు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా ఉండదు.. అని చేస్తున్న ప్రకటనలను కూడా మీరు తప్పక తప్పు అని చెప్పాలి కేసీఆర్ గారూ.. (మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అంటే.. అన్న ధోరణి విడిచి, తెలంగాణల ప్రజాస్వామ్యం తప్పక పదికాలాలు మంచిగుండాలి.. అని అభిప్రాయపడే విధానం మీకు ఉన్నట్లయితే... ).. అని విజయశాంతి ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.