ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gannavaram- Its as if YCP is losing power

గన్నవరం చేజారిపోయినట్టే.. ఇది ఫిక్స్..

Gannavaram- Its as if YCP is losing power

ఏపీలో ఈసారి అధికారం ఎవరిదైనా కానీ.. వైసీపీ అధికారం కోల్పోయిందంటే మాత్రం స్వయంకృతాపరాధమే కారణమని చెప్పాలి. అంతర్గత కలహాలు పెచ్చు మీరిపోతున్నా సైలెన్స్. పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా సైలెన్స్. విపక్ష పార్టీల నేతలను వ్యక్తిగతంగా దారుణాతి దారుణంగా కొడాలి నాని, ఆళ్ల నాని, రోజా వంటి వారు దూషిస్తున్నా సైలెన్స్. ఒక్కో సమయంలో అధినేత సైతం సంయమనం కోల్పోయి దూషణలకు తెరదీసిన పరిస్థితులు లేకపోలేదు. అది చాలదన్నట్టు సొంత పార్టీలోనే అంతర్గత కలహాలు. ఒక నేతను మరో నేత బహిరంగంగా దూషిస్తున్న సీఎం జగన్ మౌనమునిలా మారిపోయారు. వెరసి ఏపీలో పరిస్థితి ఒక వైసీపీ అభ్యర్థి విజయానికి అదే పార్టీకి చెందిన మరో నేతే గండికొడుతున్నారు. దీనికి ఉదాహరణే గన్నవరం.

గన్నవరం.. టీడీపీకి కంచుకోట. వల్లభనేని వంశీ కూడా 2018 ఎన్నికల్లో టీడీపీ తరుఫున విజయం సాధించి వైసీపీలోకి జంప్ అయ్యారు. అక్కడే ఆయన క్యాడర్‌లో పట్టు కోల్పోయారు. ఆయన వెంట పెద్దగా టీడీపీ నుంచి ఎవరూ వెళ్లింది లేదు. పోనీలే వైసీపీకి కూడా ఇటీవలి కాలంలో బలం పెరిగింది కాబట్టి ఈసారి కూడా విజయం తనదే అనుకుందామా? అంటే అక్కడ 2018లో తనపై వైసీపీ తరుఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు ఆయనకు ఆది నుంచి పడటం లేదు. దీంతో వంశీకే ఈసారి వైసీపీ టికెట్ అనగానే ఆయన టీడీపీలోకి జంప్. పోనీ మరో నేత దుట్టా రామచంద్రరావు ఉన్నారు ఆయన సహకరించడం పక్కా అనుకుంటే.. ఆయనా సైలెంట్ అయిపోయారు.అసలు ఆయన వైసీపీలో ఉన్నా లేనట్టే. ప్రస్తుతం అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న మాదిరిగా తయారైంది వైసీపీ పరిస్థితి.

వంశీ పార్టీ మారిన వెంటనే తన నోటికి పదును పెట్టారు. వైసీపీకి వెన్నుదన్నుగా అప్పటి వరకూ ఉన్న దుట్టా, యార్లగడ్డలపై కత్తి దూశారు. ఇక దుట్టాను అయితే ఇష్టానుసారంగా దూషించారు. ఒకే పార్టీలో ఉన్నా కూడా ఆయనను ఒక శత్రువులా చూశారు. కొందరు పార్టీ పెద్దలు వంశీకి నచ్చజెప్పేందుకు చూశారు కానీ ఆయన వింటేనా? ఈ సమయంలో కనీసం జగన్ అయినా కల్పించుకుని వంశీకి నోటికి అడ్డుకట్ట వేయాల్సింది కానీ ఆయన కూడా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం వంశీ ఒంటరి. పోనీ దుట్టా అయినా సహకరిస్తారేమోనని.. అధిష్టానం ఆయన వద్దకు దూతగా ఎంపీ బాలశౌరిని పంపించింది. కానీ వంశీకి సహకరించేదే లేదని దుట్టా చెప్పేశారట. వంశీని గెలిపించడమంటే తన గొయ్యిని తానే తవ్వుకోవడమని దుట్టా భావిస్తున్నారట. మొత్తానికి చేసేదేమీ లేక బాలశౌరి పార్టీ విజయానికి దుట్టా పని చేస్తారంటూ రొటీన్ డైలాగ్స్ మీడియా ముందు కొట్టి వెళ్లిపోయారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈసారి గన్నవరంలో ఆ పార్టీ ఘోర పరాజయం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

Gannavaram Politics

gannavaram