నిర్మాతలు-థియేటర్స్ యాజమాన్యాలు కలిసి కూర్చుని థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు హిట్ అయితే ఎనిమిది వారాలు, ప్లాప్ అయితే నాలుగు వారాల తర్వాతే ఆ సినిమాలని ఓటిటిలో రిలీజ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. అది ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పని చేసినా.. తర్వాత తర్వాత ప్లాప్ సినిమాలు మూడు వారాలకి, హిట్ సినిమాలు నాలుగు వారాలకే ఓటిటిలో విడుదల చెయ్యడంతో అటు నిర్మాతలు పని బానే ఉంది. సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు ఓటిటీ నుంచి వచ్చేస్తుంది. కానీ అటు సినిమాని కొన్న బయ్యర్లు హిట్ అయిన సినిమాలతో లాభాలు సంపాదించుకోవడానికి లేదు. ప్లాప్ సినిమాల సంగతి సరే సరి.
అయితే ఇప్పుడు ఓటిటీ రచ్చ రగిలింది. మలయాళంలో 2018 మూవీ ఈ ఓటిటీ రచ్చకి తెరలేపింది. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 5న మలయాళంలో విడుదల కాగా.. ఇతర భాషల్లోకి తర్వాత రెండు వారాలకే డబ్ చేసి వదిలారు. థియేటర్స్ లో 2018 మూవీ అనుకోని విజయం సాధించింది. ఎవరూ ఈ రేంజ్ హిట్ అవుతుంది అని భావించలేదు. 150 కోట్లకి పైగా కొల్లగొట్టిన ఈ మూవీని జూన్ 7 నుండి ఓటిటిలో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా 2018 ఓటిటీ పార్ట్నర్ సోని లివ్ ప్రకటించింది.
అయితే ఇప్పటికి థియేటర్స్ లో ఆడుతున్న ఈ చిత్రం రేపటినుండి ఓటిటిలో విడుదల కావడం పట్ల థియేటర్స్ యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ థియేటర్స్ ని క్లోజ్ చెయ్యడం వరకు వచ్చాయి. కేవలం ఐదు వారాలకే ఈ సినిమా ఓటిటిలోకి రావడంపై వారు వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. దానితో 7, 8 తేదీల్లో థియేటర్స్ బంద్ పాటించాలనే నిర్ణయానికి వచ్చేసారు.
ఈ చిత్రాన్ని ఇంత త్వరగా ఓటిటిలో రిలీజ్ చేస్తే తమకి రెండు వందల కోట్ల నష్టం వస్తుంది అంటూ వారు రచ్చ మొదలు పెట్టారు. ఇది ఇక్కడితో ఆగదని వారు నిర్మాతలని హెచ్చరిస్తున్నారు.