తిరుపతి మొత్తం జనసంద్రమైంది. అక్కడ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చెయ్యడంతో.. ప్రభాస్ ఫాన్స్ వేలాదిగా అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుండే తిరుపతి మొత్తం ప్రభాస్ అభిమానులతో నిండిపోయింది. బాహుబలితో విశేషమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్.. ఆదిపురుష్ తో జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి SVU గ్రౌండ్స్ లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో మొదలు కాబోయే ఈ ఈవెంట్ ప్రాంగణానికి ప్రభాస్ అతి త్వరలోనే చేరుకోనున్నారు. అయితే అభిమానులని అదుపు చేసేందుకు కావాల్సినంతమంది పోలీస్ బలగాలు అక్కడ చుట్టుపక్కల కాపు కాచినా.. అభిమానుల తాకిడి తట్టుకోవడానికి, ప్రత్యేకంగా ప్రభాస్ ని సంరక్షించడానికి 100 మంది బౌన్సర్లు ని సిద్ధం చేసారు. అక్కడ ప్రభాస్ కటౌట్ కి పాలాభిషేకాలు, పూల దండలతో పూజలు అబ్బో ఫాన్స్ ప్రభాస్ ని రాముడిగా కొలిచేస్తున్నారు.
బౌన్సర్లు మాత్రమే కాకుండా సభ ప్రాంగణానికి బాంబ్ స్క్వాడ్ కూడా చేరుకుంది. వేలాదిమంది అభిమానుల మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా ఆదిపురుష్ రెండో ట్రైలర్ ని లాంచ్ చెయ్యబోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా, ప్రభాస్ ని సేవ్ చేసేందుకు సెక్యూరిటీగా 100 మంది బౌన్సర్లు కాపలా ఉండడం చూస్తే ప్రభాస్ రేంజ్ అర్ధమవుతుంది. ఈవెంట్ ప్రాంగణంలో, చుట్టుపక్కల జై శ్రీరామ్ నినానాదాలతో ఫాన్స్ అల్లాడిస్తున్నారు. మరి ఆదిపురుష్ విడుదల వరకు అభిమానుల హంగామా మాములుగా ఉండేలా కనిపించడం లేదు.