మాల్స్ ఓపెన్.. థియేటర్స్ క్లోజ్

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి అతలాకుతలం అయినా దేశ రాజధాని దిల్లీ దాదాపు కుదుటపడింది. లాక్‌డౌన్‌ సహా, ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దిల్లీలో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 14వ తేదీ నుంచి రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని అయితే 50శాతం సామర్థ్యంతోనే వాటిని నడపాలని అన్నారు. అదే విధంగా మున్సిపల్‌ జోన్స్‌లో వారాంతపు మార్కెట్‌లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కాకుండా పాఠశాలలు, కాలేజ్‌లు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, సినిమా థియేటర్స్, మల్టీపెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్ సెంటర్స్, పార్కులను ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ మూసే ఉంచాలని ఆదేశించారు. మార్కెట్లు, మాల్స్‌ సరి, బేసి విధానంలో మాత్రమే తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే పనిచేయాలి. వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో 20మందికి మించి ఉండరాదు.

ఢిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో పనిచేస్తాయి. ప్రజా రవాణా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్స్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి. మ్యాక్సీ క్యాబ్‌లో 5గురు, ఆర్‌టీవీలో 11మంది ప్రయాణించవచ్చు. అంతరాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాలకు ఎలాంటి నిబంధనలు లేవు. ప్రత్యేక అనుమతులు, ఇ-పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు.. అని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది

Malls, restaurants in Delhi can now open

Malls open - Theaters Close
malls
restaurants
arvind kejriwal
delhi government
delhi malls now open