పలాస దర్శకుడితో సుధీర్ బాబు చిత్రం..
Sudheer Babu to teamup with Palasa Director..ప్రేమ కథా చిత్రం సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న సుధీర్ బాబు, ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. భలే మంచిరోజు, శమంతకమణి, సమ్మోహనం, వి వంటి చిత్రాల ద్వారా తనదైన దారిలో ఆకట్టుకుంటున్నాడు. ఇటు పక్క తెలుగులో హీరోగా సినిమాలు చేస్తూనే హిందీలో విలన్ గా నటించాడు. మొన్నటికి మొన్న ఓటీటీలో వచ్చిన వి సినిమాలో సుధీర్ బాబు నటనకి ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి.
పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని తెరమీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సుధీర్ బాబు, పలాస దర్శకుడు కరుణ కుమార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. పలాస సినిమాతో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్, ఆహా యాప్ కోసం మెట్రో కథలు తెరకెక్కించాడు. ఈ మెట్రో కథలు పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ పలాస చిత్రంతో అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రస్తుతం సుధీర్ బాబుతో గ్రామీణ నేపథ్యంలో సాగే కథని వెండితెర మీదకి తీసుకువస్తాడట. ఆల్రెడీ పలాస సినిమాతో గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాపై అనుభవం ఉన్న కరుణ కుమార్, మరో మారు అదే జోనర్ లో అద్భుతం చేయబోతున్నాడు. ఇప్పటి వరకూ సుధీర్ బాబు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించడం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి. మరి ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.
Sudheer Babu to teamup with Palasa Director..






































