కీర్తి, రష్మికలకు ఛాలెంజ్ విసిరిన సమంత!
Samantha takes up Green India Challenge‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను స్వీకరించిన అక్కినేని సమంత
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు.
అనంతరం సమంత మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన అభిమానులందరూ ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఇక తన కోస్టార్స్ మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ బ్యూటీ రష్మీక మందాన్నకు ఛాలెంజ్ విసిరిన సమంత.. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Samantha Akkineni Takes Part In Green India Challenge






































