కరోనా లాక్డౌన్ ఇంత కాలం ఉంటుందని ఎవ్వరూ ఊహించనైనా ఊహించలేదు. నెల నుండి రెండు నెలల టైం ని ఎక్స్పెక్ట్ చేసిన వారికీ కరోనా వరసగా భారీ షాకులిస్తూనే ఉంది. మార్చ్ చివరి నుండి జూన్, జులై లో అయినా సినిమా థియేటర్స్ తెరుచుకుంటాయనుకుంటే.. ఆగష్టు లో కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దసరాకైనా థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకులు కరోనా భయంతో వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే మార్చ్ లో విడుదల కావాల్సిన వి సినిమా, ఏప్రిల్ లో లైన్ కట్టిన ఉప్పెన, నిశ్శబ్దం, రెడ్ సినిమాలకి ఓటిటి గాలం వెయ్యడం హీరోలు, దర్శకులు ఒప్పుకోకపోవడం జరిగింది. థియేటర్స్ లోనే మా సినిమా విడుదలవుతుంది అంటూ బింకానికి పోయారు. మీడియం రేంజ్ సినిమాలు అలాగే క్రేజ్ ఉన్న సినిమాలు కాబట్టి ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్ వారు భారీ ఆఫర్స్ ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. మరి మూడు నెలల నుండి సినిమాలని ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియక తికమకపడుతున్న దర్శకనిర్మాతలకు మళ్లీ ఓటీటీ నుండి కబురు వచ్చిందట. వి కోసం దిల్ రాజుకి, రెడ్ కోసం రామ్ కి, నిశ్శబ్దం కోసం కోన కి ఇలా ఓటీటీతో స్ట్రీమింగ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వారితో పాటుగా టాలీవుడ్ ఆహా కూడా పోటీకి వెళుతుందట.
ఇంతకుముందు ఓటీటీలలో విడుదలైన చాలా సినిమాలు నిరాశ పరచడంతో.. ప్రేక్షకులకు ఓటీటీల మీద నమ్మకం తగ్గకుండా ఇప్పుడు మీడియం రేంజ్, క్రేజ్ ఉన్న సినిమాలను ఓటీటీలో విడుదల చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారు ఓటీటీ యాజమాన్యాలు. అందుకే మళ్లీ నిర్మాతలకు భారీగా ఆశ చూపిస్తూ గాలం వెయ్యడానికి ఓటీటీ సంస్థలు రెడీ అయ్యాయి. అయితే వి సినిమాకి ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్ కన్నా కాస్త పెంచినట్టుగా తెలుస్తుంది. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలే ఓటీటీలకు క్యూ కడుతుంటే.. తెలుగు హీరోలు మాత్రం బెట్టు చెయ్యడమెందుకు.. తలొగ్గితే పోదూ అంటున్నారు. మరి మరో రెండు నెలలు థియేటర్స్ తెరుచుకోకపోతే.. చేసేదేం లేక హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలోనే విడుదల చేస్తారులే అంటున్నారు విశ్లేషకులు.