ఈ ఛాలెంజ్ కరోనాలా పాకుతోంది..: కీరవాణి

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చిత్రవిచిత్రాలుగా ఛాలెంజ్లు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరింట్లో వారు బట్టలు మొదలుకుని అన్ని పనులు చేయాలనే ఛాలెంజ్ నడుస్తోంది. మొదట దీన్ని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రారంభించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని నామినేట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్, చెర్రీ, కీరవాణి టాస్క్ పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్లో భాగంగా.. ఇంట్లో బట్టలు ఉతికి ఆరేస్తూ, తువాళ్లను మడత పెడుతూ.. మొక్కలకు నీళ్లు పోసి, డైనింగ్ టేబుల్ను కీరవాణి శుభ్రం చేశారు.
తాజాగా.. ఓ ప్రముఖ చానెల్కు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇచ్చిన కీరవాణి పలు విషయాలు పంచుకున్నారు. ఈ ఛాలెంజ్ కరోనా వైరస్లా పాకుతోందని చెప్పుకొచ్చారు. దీన్ని తనతో పాటు, ఇతరులు కూడా స్వీకరిస్తున్నారన్నారు. తాను ఈ ఛాలెంజ్ను పూర్తి చేసిన తర్వాత దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు థమన్ను నామినేట్ చేశానని తెలిపారు. ఈ సందర్భంగా లాక్డౌన్ సమయంలో జరుగుతున్న పరిణామాలను సైతం ఆయన పంచుకున్నారు. కొందరు సరదా కోసం బయటికొస్తున్నారని.. నిజంగా అలా రావడం మూర్ఖత్వం అన్నారు. సరదా కోసం బయటికొచ్చేవారు.. ఇతరుల ప్రాణాలనూ రిస్క్లో పెడుతున్నారని చురకలు అంటించారు. లాక్ డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ అయినప్పటికీ కావాల్సినవన్నీ సమకూరుతున్నాయ్ కదా.. అలాంటప్పుడు ఇక బయటికి తిరగాల్సిన అవసరమేంటి..? అని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాక్డౌన్.. కన్నా లాంగ్ గ్యాప్ ఇంట్లోనే ఉన్న రోజులున్నాయని.. లైఫ్లో తాను ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసినట్లు కీరవాణి చెప్పుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ ఉత్పాతాలనే చూశామన్నారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని అందుకే ఇలా ‘కరోనా’ రూపంలో మందలించిందన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా కరోనా కంటే నీటి ఎద్దడి అనేది ఇంకా ఎక్కువగా భయపెడుతోందని చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో.. ఆర్ఆర్ఆర్ గురించి ఏదైనా ఆసక్తికర విషయాలు పంచుకోవడానికి మాత్రం ఆయన అస్సలు సాహసించలేదు.
Music Director MM Keeravani Over Challange..
Music Director MM Keeravani Over Challange..








































