గొల్లపూడి మారుతీరావు ఇక లేరు
Gollapudi Maruti Rao No Moreప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
మారుతీరావు కొన్నాళ్లు విశాఖలో మరికొంతకాలం చెన్నైలో ఉంటున్నారు. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. సాహితీ రంగంలోనూ ఆయన విశిష్ట కృషి చేశారు. రేడియో వ్యాఖ్యతగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతిముత్యం లాంటి సినిమాలో వినూత్న విలనిజం చూపించారు. తనయుడు శ్రీనివాస్ పేరుతో కొత్త దర్శకులకు విశిష్ట ప్రోత్సాహాకాలు, అవార్డులను గొల్లపూడి అందించారు. నాటకాలు, నాటికలు, కథానికలు, సినిమా కథలు పత్రికా వ్యాసాల్లో గొల్లపూడి మారుతీరావు ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. ‘కౌముది’ పేరుతో ఆయన వ్యాస సంకలనాలు వచ్చేవి. వర్తమాన రాజకీయాలు, క్రికెట్ లాంటి అంశాలపై చురుక్కుమనే చతురత గొల్లపూడి మారుతీరావు ప్రత్యేకత.
Gollapudi Maruti Rao Passes Away






































