‘అరవింద..’పై పరుచూరి సంచలన వ్యాఖ్యలు
Paruchuri Gopala Krishna Sensational Comments on Aravinda Samethaటాలీవుడ్ సీనియర్ రచయితలైన పరుచూరి గోపాలకృష్ణ తన అనుభవాలను పాఠాలుగా మార్చి.. యూట్యూబ్ ద్వారా ‘పరుచూరి పాఠాలు’ అంటూ ప్రేక్షకలోకానికి సినిమా పాఠాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో వారానికి ఒక సినిమా చొప్పున ‘పలుకులు’, ‘పాఠాలు’ అంటూ పరుచూరి తెలుపుతున్న విషయాలు ఎంతో గొప్పవైనవనే చెప్పుకోవాలి. అయితే ఒక్కోసారి ఆయన చెబుతున్న విషయాలు సెన్సేషన్ని క్రియేట్ చేస్తుండటం విశేషం. అదెలా అంటే.. ఒక స్టార్ హీరో సినిమా ఇలా చేయకుండా, అలా చేసి ఉంటే చాలా బాగుండేది అంటూ పరుచూరి వివరిస్తున్న తీరు.. అవును కదా.. నిజమే కదా.. అని అనిపించమానదు.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైన 18 నిమిషాల వరకూ యాక్షన్ సీన్స్ తో త్రివిక్రమ్ విందుభోజనం పెట్టేశాడని, మొదటి 18 నిమిషాల్లోనే ఆ రేంజ్ లో చూపించడంతో, ఓపెనింగ్ లోనే క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక మొండి కత్తితో హీరో చాలామందిని చంపేశాక.. నాయనమ్మ హీరోకి చెప్పే సందేశంతో కత్తి వదిలేస్తాడు. మీ తాత, మీ నాయన కత్తి పట్టారంటే అందులో అర్ధం, అవసరం ఉంది. నువ్వు కూడా కత్తి పడితే, నీ తర్వాత తరం గురించి ఆలోచించి.. కత్తి వదిలేయరా.. అని హీరోకి నాయనమ్మ చెబుతుంది. ఆవిడ మాట గౌరవించి హీరో కత్తిని వదిలేస్తాడు. దాంతో మాస్ ప్రేక్షకుల గుండె చల్లబడిపోయింది. ఆ తరువాత దర్శకుడు స్టోరీని ప్రేమవైపు కదిలించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ వంటి హీరోని పెట్టి.. సైలెంట్గా కథ నడిపిస్తే.. ఇదేంట్రా హీరో సైలెంట్ అయిపోయాడు.. అని అందరూ అనుకోవడం సహజమే. స్టార్టింగే క్లైమాక్స్ చూపించకుండా.. లవ్ స్టోరీతో మొదలుపెట్టి కథను నెమ్మదిగా తీసుకెళ్లి ఉంటే.. మరో చరిత్రను ఈ ‘అరవిందసమేత’ సృష్టించేదని.. పరుచూరి తన పాఠాలలో తెలిపారు.
Paruchuri Gopala krishna About Aravinda Sametha







































