సుధీర్బాబు దోచుకునేలానే ఉన్నాడు
Sudheer Babu about Nannu Dochukunduvateసూపర్స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్బాబు బావగానే గాక నటునిగా కూడా 'భలే మంచిరోజు, ప్రేమ కథా చిత్రం'వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్బాబు. ఆయన ఇటీవల ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన 'సమ్మోహనం' చిత్రం మంచి విజయం సాధించి ఆయన కెరీర్లో చెప్పుకోదగిన హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన 'నన్ను దోచుకొందువటే' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన భీమవరం వచ్చారు. కృష్ణ, మహేష్బాబు, సుధీర్బాబు అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధీర్బాబు కాసేపు అభిమానులతో ముచ్చటించారు. 'నన్ను దోచుకొందువటే' చిత్రాన్ని విజయవంతం చేయాలని అభిమానులకు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. మొదటి సారిగా తాను భీమవరంలో అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక ఈయన బాలీవుడ్లో కూడా తెలుగు 'వర్షం'కి రీమేక్గా రూపొందిన 'బాఘీ' చిత్రంలో తెలుగులో గోపీచంద్ పోషించిన ప్రతినాయకుడి పాత్రను పోషించి, చిత్రం పెద్ద విజయం సాధించకపోయినా కూడా నటునిగా బాలీవుడ్ అభిమానులకు చేరువయ్యాడు.
త్వరలో ఆయన ప్రవీణ్సత్తార్ దర్శకత్వంలో బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్లో తెలుగు, హిందీ భాషల్లో నటించనున్నాడు. స్వతహాగా బాడ్మింటన్ ప్లేయర్ అయిన ఈయనకు ఈ చిత్రం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ని సాధించి పెడుతుందనే ఆశతో ఉన్నాడు. ఈ ఏడాది మంచి ప్రారంభం అందుకున్న ఆయన వచ్చే రెండేళ్లలో వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరి 'సమ్మోహనం' ఇచ్చిన సక్సెస్ను 'నన్నుదోచుకొందువటే' చిత్రం ఆయనకు కొనసాగింపును ఇస్తుందో లేదో వేచిచూడాల్సివుంది..!
Sudheer Babu Promotes Nannu Dochukunduvate






































