యద్ధనపూడి సులోచన రాణి ఇక లేరు!

Yaddanapudi Sulochana Rani No More

ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన నవల రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి  (79) ఇక లేరు. అమెరికాలో కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె నివాసంలో ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిసులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కో పబ్లిషర్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ‘సులోచనారాణి మృతి విషయాన్ని ఆమె కుమార్తె శైలజ గతరాత్రి నాకు ఫోన్‌ చేసి చెప్పారు. మే 21వ తేదీనాడు కుపర్టినో, కాలిఫోర్నియా, అమెరికాలోని  తన కుమార్తె గృహం నందు భారత కాలమాన ప్రకారం ఉదయం గుండెపోటు రావడంతో  ఆమె  మరణించారు. ఆమె నవలలు ఎక్కువ శాతం మేమే పబ్లిష్‌ చేశాం. సులోచనారాణి మృతి తెలుగు పాఠకలోకానికి తీరనిలోటు. స్త్రీల ఆత్మాభిమానం గురించి ఆమె తన రచనల్లో చాలా బాగా ఎలివేట్‌ చేసేవారు. సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ నవల ఇప్పటికీ ఆదరణ పొందటం అందుకు నిదర్శనం.’ అని తెలిపారు.    

యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించారు. ఈమె కథలు పలు సినిమాలుగా  రూపొంది సంచలన విజయాలు సాధించాయి. సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో 'మనుషులు - మమతలు' సినిమాకు కథను అందించారు.  ఆ తరువాత  'మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధా కృష్ణ, అగ్నిపూలు, చండి ప్రియా, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మ గౌరవం' వీటిలో  స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రాలే ఎక్కువ. 

సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ ధారావాహికలుగా రూపొందించబడ్డాయి. వీటిలో  'ఆగమనం, అగ్నిపూలు, కెరటాలు, సుకుమారి, ఋతురాగాలు, నీరాజనం, మరియు రుతుగీతం' కథలను ధారావాహికలుగా టివి దర్శకురాలు మంజుల నాయుడు అందించి టివి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  దశాబ్డం క్రితం టివి  ప్రేక్షకులను ఎంతో అలరించిన రాధా మధు కూడా యద్దనపూడి సులోచనారాణి నవలే. 

1970 దశకం నుండి ఇప్పటివరకు ఆమె రాసిన నవలలు 'ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, ఋతువులు నవ్వాయి, కలలకౌగిలి, కీర్తికిరీటాలు, కృష్ణలోహిత, గిరిజా కళ్యాణం, చీకటిలో చిరుదీపం, జీవన సౌరభం, జాహ్నవి, దాంపత్యవనం, నిశాంత, ప్రేమ, ప్రేమదీపిక, ప్రేమపీఠం, బహుమతి, బందీ, బంగారుకలలు, మనోభిరామం, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, మోహిత, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ, సౌగంధి, సుకుమారి'.

Popular Novelist Yaddanapudi Sulochana Rani Died Of Heart Attack

yaddanapudi sulochana rani
novelist
died
heart attack