అశ్వినీదత్ కు ఎన్టీఆర్ అవార్డు

తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్.
తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం.
సినిమా రంగమైనా, రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.
ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెనాలి పట్టణం NVR కళ్యాణ మండపంలో నట సింహం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సారధ్యంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ గారికి ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న చేతుల మీదుగా అందించడం జరిగింది.
2022 మే 28 న మొదలైన ఈ శత జయంతి వేడుకలు 365 రోజుల పాటు 2023 మే 28 వరకు జరగనున్న విషయం విదితమే. 365 రోజులు, వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలుగా ఈ వేడుకలను జరుపుతున్నారు.
కాగా ఇటీవలే సీతారామం చిత్ర ఘన విజయంతో నిర్మాతగా తన విశిష్టతను మరోమారు చాటుకున్న సీనియర్ నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రతిష్టాత్మక ఎన్ఠీఆర్ పురస్కారం పొందడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. అన్నట్టు ఆయన బ్యానర్ కు వైజయంతి మూవీస్ అని నామకరణం చేసిందీ, నేడు ఆ బ్యానర్ లోగోలో విజయ శంఖం పూరిస్తోందీ స్వర్గీయ నందమూరి తారక రామారావే కావడం గమనార్హం.!
Ashwini dutt received NTR shatabdhi chalachitra puraskar
NTR award for senior producer C.Ashwini dutt






































