వల్లభనేని వంశీ ఏమయ్యాడు..?
వల్లభనేని వంశీ.. గత వారం రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ, విదేశాల్లో కూడా మార్మోగుతున్న పేరు. అంత ఘనకార్యం ఏం చేశారబ్బా..? అనే సందేహం వచ్చింది కదూ..! 2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్పై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. నాడు ఈ ఘటనపై టీడీపీ నాయకులు కేసులు పెట్టినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోగా.. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకుని తాట తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే 20 మందికిపైగా అరెస్ట్ చేసిన పోలీసులు.. 71వ నిందితుడిగా ఉన్న వంశీని అరెస్ట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి.
ఏమయ్యాడు..?
అదిగో వంశీ అరెస్ట్ అయ్యాడు..? ఇదిగో సినీ ఫక్కీలో పోలీసులు పట్టేసుకున్నారు..? విదేశాలకు పారిపోతుండగా చేజింగ్ చేసి మరీ పట్టుకున్నారు..? రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు..? అని ఎన్నెన్ని వార్తలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యూట్యూబ్, వెబ్ సైట్లు.. సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా సరే వంశీ.. వంశీ.. వంశీ అనే వార్తలే కనిపించాయి. అయితే.. ఇంతవరకూ వంశీని అరెస్ట్ చేయలేదు.. ఎందుకంటే తాజాగానే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోనీ అరెస్ట్ కాలేదు.. నోటీసులు ఇచ్చారు సరే.. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు..? అనేదే ఎవరికీ అర్థం కాని విషయం.
ఎందుకింత మౌనం..?
వంశీని అరెస్ట్ చేసి ఉంటే అటు టీడీపీ నుంచి.. ఇటు వైసీపీ నుంచి ఏ రేంజిలో హడావుడి ఉండేదో చెప్పక్కర్లేదు. ఒకవేళ వైసీపీ పట్టించుకోకపోయినా కనీసం ఆయన కుటుంబ సభ్యులు అయినా మా మనిషిని ఏం చేశారు..? ఎక్కడున్నారు..? అని నానా రచ్చ చేసేవారు. కానీ.. అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎక్కడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. పోనీ ఆయన కనిపించట్లేదు అంటే భార్య లేదా బంధువులో ఫిర్యాదు అయినా చేయలేదంటే అర్థమేంటి..? ఫ్యామిలీకి తెలిసే సేఫ్ జోన్లో వంశీ ఉన్నాడేమో అనే సందేహాలు వచ్చేస్తున్నాయి. వంశీ ఎలాంటి తప్పు చేయకపోతే దాక్కుని.. లుక్ అవుట్ నోటీసుల దాకా తెచ్చుకోవాల్సిన అవసరమేంటి..? అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అయినా ఇంత జరుగుతున్నా ఫైర్ బ్రాండ్గా పేరున్న వంశీ మౌనం ఎందుకు పాటిస్తున్నారు..? అనేది అభిమానులు, అనుచరులు, కార్యకర్తలకే తెలియట్లేదట.
ఇదే గానీ జరిగితే..?
పోనీ ఇండియాలోనే ఉన్నారా..? లేదా విదేశాలకు పారిపోయారా..? అనేది అటు కుటుంబానికి.. ఇటు పోలీసులకు కూడా అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే. అయితే.. అమెరికా వెళ్లిన మాట వాస్తవమే కానీ.. తిరిగొచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని ప్రస్తుతం రాజస్థాన్, బెంగళూరుకు వంశీ తిరుగుతున్నారని లీకులు వస్తున్నాయి. మరోవైపు వంశీని ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదేగానీ జరిగితే సీన్ మొత్తం మారిపోతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయినా.. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వంశీని అంత ఆషామాషీగా కూటమి సర్కార్ వదులుంతుందని మాత్రం ఎవరూ అనుకోవట్లేదు మరి.. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.