అలిసిపోయా.. ప్యాలెస్లో రిలాక్స్ అవుతా!
అవును.. అలిసిపోయా.. ఇక బెంగళూరు ప్యాలెస్కు వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే..! అబ్బో అసలే గల్లీలో, ఢిల్లీలో కొట్లాడి.. కొట్లాడి రెస్ట్ లేకుండానే పోయింది..! ఇలా ఉంది వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి.! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలొచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలేదు కానీ.. బెంగళూరు వెళ్లనిదే మాజీకి నిద్రపట్టట్లేదు! ఇప్పటికే రెండు సార్లు వెళ్లి వారాల తరబడి ఉండొచ్చిన ఆయన.. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్యాలెస్కు వెళ్తున్నారు..! దీంతో.. ఓరి బాబోయ్ అన్న అక్కడేం పెట్టార్రా బాబూ ఇన్నిసార్లు వెళ్తున్నారని అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
పదవి లేకుంటే..!
వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ యలహంక ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా చూడని వైఎస్ జగన్.. అలా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన రోజుల వ్యవధిలోనే బెంగళూరు పయనమైపోయారు. అప్పుడే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా ఓ రేంజిలో గట్టిగా ఇచ్చిపడేశారు. దెబ్బకు మళ్లీ తిరిగొచ్చిన జగన్.. రెండోసారి కూడా వెళ్లారు. సరిగ్గా అప్పుడే ఏపీలో గొడవలు జరుగుతుండటం, వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య జరగడంతో రంగంలోకి దిగిపోయారు మాజీ సీఎం. ఇక అక్కడికెళ్లి పరామర్శించడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించిన జగన్.. ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు. ఫొటో, వీడయో ఎగ్జిబిషన్ చూపించడం, ఇండియా కూటమిలోని పార్టీల మద్దతు తీసుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక ఢిల్లీలోనే ఒక్కో మీడియాతో ఒక్కోసారి మాట్లాడిన జగన్.. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో భేటీ కావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. దీంతో తిరిగి తాడేపల్లి ప్యాలెస్కు వచ్చేసిన జగన్.. రెండు గంటలపాటు సుదీర్ఘంగా మీడియా మీట్ నిర్వహించి ఇన్నిరోజులు వైసీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు, విమర్శలు, పోలవరంపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. చూశారుగా.. అటు ఢిల్లీలో ఇటు గల్లీలో అలిసిపోయిన వైఎస్ జగన్ ఇప్పుడిక విశ్రాంతి కోసం ప్యాలెస్కు బయల్దేరి వెళ్లిపోయారు. సతీమణి వైఎస్ భారతీతో కలిసి వారం రోజులపాటు యలహంక ప్యాలెస్లోనే ఉండనున్నారు.
మూడ్.. ఉత్సాహం..!
అదేదో అంటారే.. బాగా ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో డిస్టబ్ అయితే మూడ్, ఉత్సాహం మొత్తం పోతుందంటారే.. ఇప్పుడు సరిగ్గా ఇదే మాటలు వైసీపీ కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్నాయ్..! ఏపీలో ఇంత రాద్ధాంతం జరుగుతున్న టైమ్లో అటు వచ్చి.. ఇటు మళ్లీ బెంగళూరు వెళ్లిపోవడం ఏంటి..? ప్రాజెక్టులు, మద్యం కుంభకోణం, ప్రభుత్వ పథకాల గురించి కూటమి సర్కార్ అంతగా నిలదీస్తున్నప్పుడు ధీటుగా నిలబడి కౌంటర్ ఇవ్వాల్సిన టైమ్లో మళ్లీ ప్యాలెస్కు ఎందుకన్నా..? అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంకొందరైతే అబ్బా.. అన్న అలిసిపోయాడబ్బా వారం అయినా రెస్ట్ తీసుకోకపోతే ఎలా వెళ్లి.. మళ్లీ వస్తారులేండి అని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి అప్పుడు శవం లేచినప్పుడు వచ్చి రాజకీయాలు చేశారు కదా.. మళ్లీ ఎవరో ఒకరు లేస్తే తప్ప శవ రాజకీయాలు చేయడానికి రారని విమర్శలు గుప్పిస్తున్నారు. పదవి కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ ఇలా ప్యాలెస్కు వెళ్లడం ఇప్పుడు మూడోసారి.. మళ్లీ తిరిగి ఎప్పుడొస్తారో.. 2029 ఎన్నికల వరకూ ఎన్నిసార్లు వెళ్లొస్తారో..? అయినా బెంళూరు ప్యాలెస్లో ఏముందో ఎవరికి ఎరుక..!