ఎందుకోగానీ టీడీపీకి టైం బాగోలేదనిపిస్తోంది..! నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కాగా.. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్కు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే లోకేష్ను సీఐడీ అరెస్ట్ చేయబోతోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ-14గా సీఐడీ చేర్చింది. వరుస ఘటనలతో టీడీపీలో కలవరం మొదలైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన ఏ క్షణమైనా బెయిల్ రావచ్చనే ఆశతో టీడీపీ శ్రేణులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లో హస్తినలో ఉంటూ ఎప్పటికప్పుడు న్యాయవాదులతో టచ్లో ఉంటూ వస్తున్నారు. టీడీపీ కేడర్ సైతం తమ అధినేత జైలు నుంచి బయటకు వచ్చే తరుణం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ కార్యకర్తలు, వీరాభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు బెయిల్ వస్తున్నట్టే అనిపిస్తోంది కానీ వెనక్కి వెళుతోంది. అటు సుప్రీంకోర్టులోనూ.. ఇటు హైకోర్టులోనూ చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై చంద్రబాబు కుటుంబ సభ్యులు సహా పార్టీ నేతలు, కేడర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇంకెన్నాళ్లో..!
చంద్రబాబు కస్టడీ, ముందస్తు బెయిల్, క్వాష్కు సంబంధించి అన్ని పిటిషన్లు అటు సుప్రీంకోర్టు.. ఇటు ఏసీబీ, హైకోర్టులో పెండింగ్లోనే ఉండిపోయాయి. ఇదిగో ఇవాళ విచారణకు వస్తాయని ఉదయాన్నే ప్రకటన రావడం.. ఎంతకీ రాకుండా వాయిదా పడుతుండటంతో అసలు తీర్పు ఎప్పుడొస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ రేపు అనగా బుధవారం జరగనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రేపటి విచారణ జాబితాలో వెల్లడించింది. కనీసం ఇవాళ అయినా క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశించాయి. కానీ ప్రస్తావన అవసరం లేకుండానే విచారణ తేదీని సీజేఐ రేపటికి ఫిక్స్ చేశారు. క్యూరేటివ్ పిటిషన్పై నేడు సీజేఐ నేతృత్వంలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రస్తావనలను సీజేఐ అనుమతించలేదు. ఇక రేపు కూడా విచారణ వాయిదా పడిందంటే.. అక్టోబర్ 3 తరువాతే చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. సెప్టెంబర్-28 నుంచి అక్టోబర్-02 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు అయినా పిటిషన్పై విచారణ ఉంటుందో లేదోనని టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఆందోళన..!
మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఇన్చార్జి జడ్జి పిటిషన్పై వాయిదా వేశారు. అటు సుప్రీం.. ఇటు హైకోర్టు రెండింటిలోనూ నిరాశే ఎదురైంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో 14వ నిందితుడిగా చేర్చడం కూడా టీడీపీ కేడర్ను ఆందోళనకు గురి చేస్తోంది. లోకేష్ను సైతం నేడో రేపో విచారణకు పిలవడమో లేదంటే ఏకంగా అరెస్ట్ చేయడమో చేస్తారంటూ టాక్ నడుస్తోంది. మొత్తానికి టీడీపీకి బుధవారం కీలకం కానుంది. చంద్రబాబు పిటిషన్లు అన్నింటిపైనా రేపు విచారణ జరగనుంది. ఇక మరి రేపు అన్నీ సవ్యంగా సాగుతాయో.. లేదంటే ఎక్కడివక్కడే నిలిచిపోతాయో చూడాలి. అటు పిటిషన్లు విచారణ జాప్యం.. ఇటు లోకేష్ అరెస్టుపై వస్తున్న వార్తలు.. ఆ తర్వాత మరిన్ని అరెస్టులు జరుగుతాయన్న వార్తలు టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.