ట్రిపుల్ ఆర్ తో దేశ వ్యాప్తంగానే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే జపాన్ లో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేసి వచ్చాడు. అక్కడ జపాన్ లో ట్రిపుల్ ఆర్ సెన్సేషనల్ కలెక్షన్స్ వసూలు చేస్తుండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్ళాడు. ఈ రోజు ఉదయమే బెంగుళూరు బయలు దేరి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభలో పాల్గొన్నాడు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ దిగింది మొదలు అక్కడి మంత్రులు, అధికారులు, నాయకులు ఎన్టీఆర్ ని రిసీవ్ చేసుకోవడానికి పోటీ పడ్డారు.
ఇక ఎన్టీఆర్ మాత్రమే కాదు, పునీత్ రాజ్ కుమార్ అవార్డు వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. అక్కడ మహారాష్ట్ర సర్కార్ పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న పురస్కారం ప్రకటించడంతో.. ఈ పురస్కారాన్ని ఆయన ఫ్యామిలీకి అందజెయ్యడానికి ఎన్టీఆర్-రజినీకాంత్ వెళ్లారు. ఈ సభకి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. గత ఏడాది గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అభిమానులని అతలాకుతలం చేసింది. ఆయన మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు కర్ణాటక రత్న అవార్డు ని ప్రధానం చేసింది. ఈ వేడుకకి ఎన్టీఆర్ వెళ్లగా అక్కడ ఆయనకి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. వర్షంలో తడుస్తూనే ఎన్టీఆర్-రజిని స్పీచ్ ఇవ్వగా, అభిమానులు కూడా వర్షాన్ని లెక్క చెయ్యకుండా అలానే ఉన్నారు.