ఈమాటన్నది ఎవరో కాదు సినిమా నటుడు, ఎస్వీబిసి మాజీ చైర్మన్ పృథ్వీరాజ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పృథ్వీ వైసిపి అండతో చెలరేగిపోయాడు. తిరుపతి దైవసన్నిధానంలో చెయ్యకూడని పనులు చేసి దొరికిపోయి చివరికి పదవి పోగొట్టుకోవాల్సి వస్తుంది అని తానే రాజీనామా చేసి ఇప్పుడు అందరూ కావాలనే నన్ను ఇరికించారు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. పదవికి రాజీనామా చేశాక మళ్ళీ తిరుముల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లిన పృథ్వీ తనని ఎస్వీబిసి చైర్మన్ గా దించడానికి ఎన్నో ఎత్తులు వేసి అందులో అందరూ సఫలం అయ్యారని అన్నాడు.
అయితే తనకి పదవి పోయాక రాజకీయ నాయకులు కానీ, సినీ ప్రముఖులు కానీ మాట్లాడడం మానేశారని, వైసిపి నాయకులను ఎవ్వరైనా ఏమైనా అంటే వారిని ఊరుకునే వాడిని కాదని, కానీ నా పదవి పోయాక ఎవరు నాతో మాట్లాడానికి కూడా రాలేదు అని వాపోతున్నాడు. రాష్ట్రంలో లేని రాజకీయం తిరుపతిలో ఉంటుంది అని ఎందరు చెప్పినా నా తలకి ఎక్కలేదని కానీ అనుభవిస్తున్న తనకి తిరుపతి రాజకీయాల కాక బాగా తగిలింది అంటున్నాడు. నా మీద పగతో నా కడుపు మీద కొట్టారు. ఆ దెబ్బకు నా కుటుంబం అంతా చిన్నా భిన్నమై రోడ్డున పడ్డాను అంటున్నాడు. పార్టీలో కానీ, సినిమా రంగంలో కానీ మాట్లాడేవారు లేరు అంటూ తెగ ఇదై పోతున్నాడు. మరి ఇటు సినిమాలు లేక, అటు రాజకీయం గానూ పృథ్వీ కష్టాలు ఆ వెంకన్నకెరుక.