మాస్మహారాజా రవితేజ కొత్త కొత్త హీరోయిన్లకు తన చిత్రాలలో బాగా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఓ హీరోయిన్గా కాస్త బాగానే గుర్తింపు వచ్చిందంటే ఆమెకి రవితేజ చిత్రంలో చాన్స్లు ఎదురుచూస్తూ ఉంటాయనేది కూడా నిజమే... ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్లోకి ఇద్దరు హీరోయిన్లు వచ్చి చేరారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ, శ్రీనువైట్లకు చావో రేవో అయిన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ మహారాజా సరసన తెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. తర్వాత బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కిన గోవాసుందరి ఇలియానా ఇందులో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రం 16వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఆ వెంటనే ఆయన 'టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం' వంటి విభిన్నచిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్న రవితేజ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించే మూవీలో కూడా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఒక హీరోయిన్గా 'నన్నుదోచుకొందువటే' హీరోయిన్ నభానటేష్ ఫిక్స్ అయ్యారు. ఇక రెండో హీరోయిన్ పాత్ర కోసం 'ఆర్ఎక్స్ 100' వంటి బోల్డ్ చిత్రంలో నటించిన పాయల్ రాజ్పుత్ని ఎంపిక చేశారట. డిసెంబర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రవితేజ ఆస్థాన సంగీత దర్శకుడైన తమన్ సంగీతం అందిస్తున్న ఇందులో సునీల్ ఓ కీలకపాత్రను పోషించనున్నాడు. మరి ఈ చిత్రం పాయల్ రాజ్పుత్కి స్టార్ హీరోల చిత్రాలలో చాన్స్లు వచ్చేలా చేస్తుందేమో వేచిచూడాల్సివుంది..! ఎందుకంటే రవితేజతో నటించిన పలువురు హీరోయిన్లు గతంలో స్టార్ హీరోయిన్లుగా మారడం వల్ల ఈ మూవీపై పాయల్ రాజ్పుత్ కూడా ఎంతో నమ్మకంతో ఉందిట..!