Advertisement

జగన్ మార్క్ మేనిఫెస్టో.. నవరత్నాలు 2.0

Sat 04th May 2024 12:45 PM
ys jagan manifesto  జగన్ మార్క్ మేనిఫెస్టో.. నవరత్నాలు 2.0
YS Jagan Mark Manifesto Navaratnalu 2 Point O జగన్ మార్క్ మేనిఫెస్టో.. నవరత్నాలు 2.0
Advertisement

నేను చెప్పింది చేస్తాను.. చేసేదే చెబుతాను! చేసిందే చెబుతాం.. చెప్పిందే చేస్తాం..! మాట తప్పను.. మడమ తిప్పనంతే!. అలివిగాని హామీలు ఇవ్వడం, అమలు చేయలేకపోవడం నిలదీస్తే దొడ్డిదారిన వెళ్లిపోవడం నాకిష్టం లేదు. మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99 శాతానికిపైగానే నెరవేర్చాం.. మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి.. లేకుంటే అక్కర్లేదంతే..! ఇవీ.. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతుండే మాటలు. ఏప్రిల్-27న మేనిఫెస్టో రిలీజ్ రోజున కూడా ఇవే మాటలు రిపీటయ్యాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలెన్ని..? నెరవేర్చినవి ఎన్ని..? మిగిలినవి ఇంకెన్ని..? ఇప్పటి వరకూ ఎంత మందికి లబ్ధి చేకూరింది..? ఎన్నికోట్లు ఖర్చుపెట్టాం..? ఇలా లెక్కలేసి మరీ నిశితంగా వివరించారు జగన్. నవరత్నాలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ఈ 2024లో కూడా నవరత్నాలు 2.0గా హామీలు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అలివిగాని హామీలు ఇవ్వలేదు.. విశ్వసనీయతకు మారుపేరుగా.. నిజం, నమ్మకానికి నిలువెత్తు రూపంలా మేనిఫెస్టో రిలీజ్ చేశారనే టాక్ గట్టిగానే నడుస్తోంది.

మేనిఫెస్టో నచ్చిందా..?

జగన్ రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో అద్భుతాలే ఉంటాయని నిన్న, మొన్నటి వరకూ వైసీపీ కార్యకర్తలు, నేతలు వేయి కళ్లతో ఎదురుచూశారు. వాస్తవానికి డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ కచ్చితంగా ఉంటుందని ఏపీ ప్రజలు సైతం ఆశించారు కానీ.. ఈ రెండూ లేకపోవడం వైసీపీకి బాగా మైనస్ అయ్యిందనే చర్చ మాత్రం నడుస్తోంది. కొందరు సొంత పార్టీ కార్యకర్తలే ఒకింత నిరాశపడుతున్నారు. అయితే.. ఈ రెండూ కూడా సాధ్యం కానివి కాబట్టే జగన్ వీటికి పోలేదన్నది రాజకీయ విశ్లేషకులు, మేధావుల మాట. అందుకే రైతు భరోసా, మహిళలకు ఇచ్చే చేయూత ఇవి రెండూ పెంచారని వైసీపీ నేతలు డిఫెండ్ చేసుకుంటున్నారు. అందుకే.. వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు చేయడం జరిగింది. ఇక వైయ‌స్ఆర్ రైతు భరోసా కింద రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచడం మంచి పరిణామమే. అంతేకాదు.. ఈ భరోసా అనేది కౌలు రైతులకు కూడా వర్తింపజేయడం నిజంగానే శుభపరిణామమే అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు.. వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం తీసుకునే వెసులుబాటు ఇవ్వడం మంచిదే. ఇక 2019లో లాగా ఇప్పుడు కూడా నవరత్నాలు కొనసాగిస్తానని.. మునుపటితో పోలిస్తే పెంపుదల చేసి మేనిఫెస్టో ప్రకటించారు జగన్. 

నాడు.. నేడు పెరిగిందేంటి..!

అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైయ‌స్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపుగానే మేనిఫెస్టో 2024 ఉంది. అమ్మఒడి రెండు వేలు పెంపు.. అంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ. 15 వేలు ఇప్పుడు రూ. 17వేలు అవుతుందన్న మాట. ఇందులో.. విద్యార్థుల తల్లుల చేతికి రూ.15 వేలు వస్తుంది. రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంపు ఉంటుంది. వైద్యం, ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించడం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఇక వైయ‌స్ఆర్ కాపు నేస్తం పథకం కింద నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంచడం జరిగింది. ఇది కాపు సామాజిక వర్గానికి ఉపయోగపడేది. మునుపటితో పోలిస్తే ఇది డబుల్. గెలుపోటములను నిర్ణయించే కాపులు జగన్ మేనిఫెస్టో ఫిదా అయినట్లుగా ఆ సామాజికవర్గ నేతలు చెబుతున్నారు. ఇక నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం రూ. 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచడం మామూలు విషయం కాదు. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేయడం మంచిదే. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు, వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతామని జగన్ ప్రకటించారు. దీంతో పాటు.. లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపజేయడం నిజంగా మంచిదే. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కూడా చేయిస్తామని చెప్పడంతో ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

ఫ్రీ కరెంట్.. కొనసాగింపులు ఇవీ..!

ఇదిలా ఉంటే.. చేనేతలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు ఇవ్వనున్నట్లు మేనిఫెస్టో 2.0లో జగన్ స్పష్టం చేశారు. మునుపటిలాగే వైయ‌స్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, లా నేస్తం కొనసాగింపుగానే ఉంది. అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు ఇది 2019 ఎన్నికల్లో చెప్పిందే కొత్తేమీ లేదు. నాడు-నేడు కింద ట్యాబ్‌ల పంపిణీ కొనసాగిస్తున్నారు. 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌ పెట్టడం అంటే.. విద్యకు జగన్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌, జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ, తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ.. మునుపెన్నడూ ఇలాంటి ప్రయత్నాలు ఏ సర్కారూ చేయలేదని చెప్పుకోవాలి. ఇది నిజంగా ఊహకందని విషయమే. స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైయ‌స్ఆర్ బీమా వర్తింపు ఉంటుందని ప్రకటించడంతో ఆయా వర్గాలు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఎందుకంటే.. వేళ గాని వేళలో బైకుల మీద వస్తుంటారు.. వెళ్తుంటారు ఇది సమయం మీద ఆధారపడే ఉద్యోగం గనుక ఇది మంచిదేనని చెప్పుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌.. అని చెప్పారు కానీ ఎన్ని యూనిట్ల వరకూ అనేది క్లారిటీ రాలేదు. ఇక ఎలాగో రాజధాని గురించి కూడా క్లియర్ కట్‌గానే జగన్ చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తాం.. రాజధానిని చేస్తామని కుండ బద్ధలు కొట్టేశారు. ఇక అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని క్లియర్ కట్‌గా జగన్ చెప్పేశారు. నిజంగా ఈ మేనిఫెస్టోను చూస్తే.. ఎక్కడా ఓవర్ అని కాకుండా రెండంటే రెండు పేజీల్లో చేసేది చెప్పేశారు.. ఇక ఇంతకుమించి కూటమి హామీలు ఇస్తే పరిస్థితేంటనేది తెలియట్లేదు.

YS Jagan Mark Manifesto Navaratnalu 2 Point O:

YS Jagan Released His Manifesto 2024

Tags:   YS JAGAN MANIFESTO
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement